CM Sri A Revanth Reddy participated in Ugadi celebrations at Ravindra Bharathi

ఒక గొప్ప నమూనా నగరంగా ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మించి, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. కేవలం జనావాస యోగ్యమైన నగరంగా కాకుండా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి, అన్ని వర్గాల యువతకు లక్షలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ‘ఫ్యూచర్ సిటీ’కి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన వేడుకలో పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.

ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ,

“స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగర నిర్మాణం దేశంలో ఎక్కడా జరగలేదు. ఉన్న నగరాలే కాస్త విస్తరించబడ్డాయి. నగరాల విస్తరణ అస్తవ్యస్తంగా మారడం వల్ల ప్రపంచంలో వెనుకబడిన దేశంగా ఉండిపోయింది. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణ రైజింగ్ #TelanganaRising దేశానికి ఆదర్శంగా నిలబెట్టే, ప్రజలకు ఆదర్శంగా ఉండే విధంగా, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులతో పాటు నగరానికి ఒక కొత్త ఫ్యూచర్ సిటీని నిర్మించాలని తలపెట్టాం.

వేద పండుతులు పంచాంగ పఠనం విన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గుర్తొచ్చిందని, బడ్జెట్ కూడా షడ్రుచులతో కూడుకుని ఉంది. బడ్జెట్ లో కొన్ని నియంత్రణలు పాటించారు. చాలా అంశాల్లో ఉదారంగా ముందుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ గిట్టుబాట ధరలతో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, పేదలకు వైద్యం అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఆ రంగాలకు అధిక నిధులు కేటాయించడం జరిగింది.

రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే పెట్టుబడులు రావాలి. శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు కావాలి. అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా నిరంతరం ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది.

ఒకప్పుడు పేదవాడు పండుగ పూట మాత్రమే తెల్లన్నం తినే వారు. మొట్టమొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 1.90 లకే కిలో బియ్యం పథకాన్ని, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు రూ. 2 లకే కిలోబియ్యం పథకం, ఆ తర్వాత దేశంలో ఆహార భద్రతా చట్టం తేవడం వంటి కార్యక్రమాలతో పేదవారి ఆకలిని దూరం చేసే దిశగా ప్రయాణం జరుగుతున్నాయి.

శ్రీమంతులు తిన్నట్టుగా నిరుపేదలు సన్నబియ్యం తినాలి. తెలంగాణలో సన్నబియ్యం అత్యధికంగా పండించే దిశగా ప్రభుత్వం గిట్టుబాటు ధరలతో పాటు బోనస్ ఇవ్వడం ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నాం. గతేడాది దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి సాధించుకున్నాం. ఈ సీజన్ లో కూడా అత్యధికంగా పండిస్తున్నారు.

రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలన్న ఒక గొప్ప లక్ష్యంతో, ఈ ఉగాది పండుగ పేదవారి ఇళ్లల్లో సంతోషాన్ని తెచ్చిపెట్టాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నాం.

తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నదని వేద పండితులు చెప్పినట్టుగా రాష్ట్రాభివృద్ధికి మంచి నిర్ణయాలు తీసుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంస్థలతో మంచి వాతావరణంలో అందరి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం.

మా సంకల్పంలో, ఆలోచనల్లో స్పష్టత ఉంది. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కరుణిస్తారు. “తెలంగాణ రైజింగ్ 2050” ప్రణాళికతో దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీసుకెళ్లాలని సంకల్పించాం. అందరి ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడుతాం” అని ముఖ్యమంత్రి గారు చెబుతూ ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ గారు, జూపల్లి కృష్ణారావు గారు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, ఇతర ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.