రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన బహిరంగ సభ వేదికగా అశేష ప్రజానీకం సమక్షంలో ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ,
“పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తాం. అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం.
ఏ ప్రభుత్వాలున్నా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం. పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించాం.
పేదలు దొడ్డు బియ్యం తినలేరు. పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. ఈ గడ్డ మీద నుంచి ప్రారంభించిన పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటాం.
దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. రైతుల శ్రమ ఎక్కడికీ పోదు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశాం. మొదట్లోనే 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించాం. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచాం.
రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా సన్నబియ్యం పండిస్తున్నారు. సన్నవడ్లకు బోనస్, అత్యధికంగా రైతు రుణమాఫీ ఈ జిల్లాలోనే జరిగింది.
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ నల్గొండ ప్రాంతం చైతన్యానికి, పోరాటాలకు మారుపేరు. అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా నిలబడుతుంది. మీ సహకారంతో పదేళ్లలో తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా, దేశానికి నంబర్ 1 గా ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాం” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.
స్వయం సహాయక మహిళా సంఘాలకు ఈ వేదికగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ముఖ్యమంత్రి గారు 26.10 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు హుజూర్ నగర్కు వ్యవసాయ కళాశాల, మిర్యాలగూడకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.